Kamareddy: కామారెడ్డి, ఏప్రిల్ 23 (ప్రజా శంఖారావం): తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణ పార్ట్ టైం అధ్యాపకులు బుధవారం కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే తో మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలలో తాము గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ నయా బానిసత్వానికి గురవుతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వం జీ.వో 21 తీసుకువచ్చి కనీసం తమ సర్వీసులను పరిగణలోకి తీసుకోకుండా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని తెలిపారు. తమకు మినిమం టైం స్కేల్ అమలు చేసి రెగ్యులర్ రిక్రూట్మెంట్లో మొదటి ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. అనంతరం ఎమ్మెల్యే వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ వారి న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర యూనివర్సిటీల జాయింట్ సెక్రెటరీ డా. ఇంద్ర కరణ్ రెడ్డి, డా. శ్రీకాంత్ గౌడ్, డా. కనకయ్య, డా. శ్రీను కేతావత్, డా. పోతన ఉన్నారు.