Nizamabad: నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చి 01 (ప్రజా శంఖారావం): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ అకస్మాత్తుగా తనిఖీలు చేయడంతో సిబ్బంది కంగారుపడ్డారు. నిజమాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును ఆయన పరిశీలించారు.
అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఇన్ పేషంట్ వార్డును సందర్శించి సదుపాయాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి వాకబు చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఇటీవలి కాలంలో పీ.హెచ్.సీ ని సందర్శించారా అని ఆరా తీశారు. సమయ పాలన పాటిస్తూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు ఆయన సూచించారు.
ఇది కూడా చదవండి : కస్టమర్లకు ఝలక్ ఇచ్చిన బ్యాంక్.. ఈరోజు నుంచి కీలక నిర్ణయం అమలులోకి
కాగా, శిథిలావస్థకు చేరుకున్న పీ.హెచ్.సీ పాత భవనాన్ని పరిశీలించిన జిల్లా పాలనాధికారి, కొత్త భవనం మంజూరీ వివరాల గురించి ఆరా తీశారు. వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ తదతరులు ఉన్నారు.